జిల్లాలో ఉపాధి హామీ ప్రగతి లక్ష్యాలను అధిగమించాలి
-ప్రతి కుటుంబానికి వందరోజుల రోజుల పనిని తప్పనిసరిగా కల్పించాలి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి
నంద్యాల ప్రతినిధి. జూలై 01 . (నంది పత్రిక ):జిల్లాలో ఉపాధి హామీ ప్రగతిలో లక్ష్యాలను వందశాతం అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక డ్వామా కార్యాలయంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ ద్వారా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉపాధి హామీ పనులను పటిష్టంగా అమలు చేసి లక్ష్యాలలో వందశాతం ప్రగతి సాధించాలని సూచించారు. లేబర్ మొబిలైజేషన్ లో భాగంగా ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిని తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఇందులో భాగంగా పండ్ల తోటల పెంపకం, లేబర్ టార్గెట్, సరాసరి దినసరి వేతనం, ఫారం పాండ్స్, సోక్ పిట్స్, నాడేప్ కంపోస్ట్ పిట్, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాలలో మండలాల వారీగా ప్రగతిపై సమీక్షించారు. వెనుకబడిన మండలాల అధికారులతో కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రగతిలో వెనుకబడిన మండలాలు ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, ఎం అండ్ ఇ భాస్కర్ నాయుడు, ఏపీడీలు నరసింహారెడ్డి, సాంబశివరావు, అన్వరా బేగం, కోర్సు డైరెక్టర్లు ఏసుదాస్, పరమేశ్వరుడు, ఇస్మాయిల్, ఏపిఓలు, ఇసిలు, ప్లాంటేషన్ సూపర్వైజర్లు, క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Comment List