భక్తులందరికీ ప్రశాంత మల్లన్న దర్శనం
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర సదుపాయాలు
ఫిబ్రవరి 13 నుండి16 తేదీల్లో టోల్గేట్ రుసుము మినహాయింపు
24 గంటల ప్రయాణ రాకపోకలకు అనుమతి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంది పత్రిక:
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 12 :-
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, భక్తులు ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. గురువారం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 2,59,050 మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని తెలిపారు. నిన్న ఒక్కరోజే 69 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగా, బుధవారం రాత్రి శివస్వాములు అధిక సంఖ్యలో దర్శనానికి హాజరయ్యారని చెప్పారు. నడకదారిన కైలాస మార్గం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారని వివరించారు. రానున్న రెండు రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పాతాళగంగ వద్ద పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు స్నాన ఘట్టాల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 75 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించారు. దుస్తులు మార్చుకునే గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పారిశుధ్య చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రవాణా సౌకర్యాల విషయమై ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నంద్యాల - శ్రీశైలం మార్గంలో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున ఏపీఎస్ఆర్టీసీ తరఫున 1,800 బస్సులు, తెలంగాణ రాష్ట్రం నుండి 1,000 బస్సులు, ఇతర ప్రాంతాల నుండి మొత్తం 3,000 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు, అటవీ శాఖ, దేవస్థానం మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు.ఫిబ్రవరి 13, 14, 15, 16 తేదీల్లో టోల్ గేట్ల వద్ద రుసుము మినహాయింపు కల్పించినట్లు ప్రకటించారు. రాత్రివేళల్లో కూడా నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతు సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతంలో వాహనదారులు గంటకు 30 కి.మీ. వేగ పరిమితిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి ప్రయాణాల్లో భద్రతా దృష్ట్యా ఒకేసారి పది వాహనాలను కాన్వాయ్ రూపంలో అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో రెండు, ఐదు లీటర్ల ప్లాస్టిక్ బాటిళ్లకు అనుమతి లేకపోవడంతో అటవీ శాఖ అనుమతి పొంది బుధవారం మధ్యాహ్నం నుండి అర్థ లీటర్ నీటి బాటిళ్లను తీసుకురావడానికి అనుమతి కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.భక్తుల క్యూలైన్లలో తాగునీటి సదుపాయంతో పాటు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 71 వేల మంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా భక్తులు మరింత సౌకర్యవంతంగా, ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, భద్రతా ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Comment List