తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత
పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే
కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం
అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్
‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే
45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం
1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం
కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు
కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని, రాష్ట్రం ఫస్ట్ మన సంకల్పమని, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు... నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటంచేశామన్నారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతోముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. అంతకుముందు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.
*ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది*
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. తొలిసారి దేవుని కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికలు అయ్యి ఏడాదైనా కార్యకర్తల్లో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10 కి ఏడుస్థానాలు గెలిచి సత్తాచాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 మనవే.ఇప్పటి వరకూ మనం 34 మహానాడులు జరుపుకున్నాం. ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించబోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితికి దశ దిశ నిర్ధేశిస్తుంది. గతంలో మహానాడు అంటే ఎండలు మండేవి. ఈసారి చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతోంది.
*కార్యకర్తల పోరాట ఫలితమే ఈ అద్భుత విజయం*
2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్తో చరిత్ర సృష్టించామంటే అందుకు పసుపు సైనికుల పోరాటం, త్యాగాలే కారణం. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయడం ఈ మహా విజయానికి దోహదం చేసింది. ఏమీ ఆశించకుండా దశాబ్ధాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నాం. దీన్ని ప్రతి నేత కూడా గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి.
*గొంతు కోసినా జై తెలుగు దేశం అన్నారు*
పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులుగా గత పాలకులు మార్చారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి వేటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కానీ ఒక్క కార్యకర్త కూడా ఎత్తిన జెండా దించలేదు. ప్రశ్నించినవారి గొంతునొక్కేందుకు గొంతులు కోశారు. మన పసుపు సింహం చంద్రయ్య గొంతు కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. ఎందరో కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి స్పూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుంది. ఎత్తిన జెండా దించని కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ త్యాగాలు వృథా కానివ్వం. కార్యకర్తల కష్టాలను గుర్తిస్తాం. సంక్షేమం అందిస్తాం. వర్షాలు వస్తున్నా మహానాడు జయప్రదం చేయాలని వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉంది.
*పాలనలో టీడీపీ ట్రెండ్ సెట్టర్*
దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం టీడీపీనే. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు, తర్వాతగా చూడాలి. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకూ, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా వర్సిటీ వరకూ, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకూ రూ. 2 కే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకూ, రూ.30 పింఛను నుంచి రూ.4 వేల పింఛను వరకూ, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత వరకూ నిరుద్యోగ పరిస్థితులను నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాల్లో సత్తా చాటే వరకూ, సీమలో రైతుల సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకూ, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ టీడీపీ. అడిగే పరస్థితి నుంచి బీసీలు శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఒక వర్గం, ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు పుట్టిన తర్వాత అని గీత గీసి చెప్పే పరిస్థితి. మనందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమే.
*నేను నిత్య విద్యార్థిని*
నేను నిత్య విద్యార్థిగా ఉంటాను. ప్రతిరోజూ నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతాను. కార్యకర్తలే నాకు ఆయుధాలు. మీరు నేనూ కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయొచ్చు. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాము. అధికారంలోకి రాగానే అవినీతి రహిత పాలన అందిస్తున్నాము. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైనా చేస్తాం. భావితరాల భవిష్యత్ కు అవసమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీనే. నేడు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అదీ మన సత్తా. మనది మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్. ప్రజలిచ్చిన తీర్పును ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాం. సొంత అవసరాలకు వాడలేదు. వాడము. అదే టీడీపీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలకు బ్లూ ప్రింట్ గా నిలిచాయి.
*సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం*
రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం. 40 ఏళ్లకు ముందే బీసీలను రాజకీయాల్లో భాగస్వాములు చేశాం. ఇదే టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చింది. మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చింది. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాతలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ.
*జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర*
జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే... ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు నిరూపణ అయ్యింది. విద్యుత్ సంస్కరణలు, పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ వంటివి దేశానికి పరిచయం చేశాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానంలో నూతనత్వం తీసుకొద్దాం. కడప గడ్డపై జరుగుతున్న మహానాడులో అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్కు కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఈ మహానాడు భవిష్యత్ను ఒక దశదిశా నిర్దేశించే విధంగా ఉండబోతోంది.
*అభివృద్ధికి కేరాఫ్ ఏపీ కాబోతోంది*
స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకుమించి రెట్టింపు అభివృద్ధి జరగబోతోంది. 2025 మహానాడు ఒక చరిత్ర తిరగరాయబోతోంది. మంత్రి లోకేష్ ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ విడుదల చేస్తారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చేలా తీర్మానం చేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు నాంది పలుకుతాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటివి చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్ కాస్ట్ తగ్గేలా మన ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు నేను హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ లో ఐటీ తెచ్చాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుజాతిని ముందుకు నడిపిస్తాను. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ తయారుచేస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తెచ్చాం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం రూ. 55 లక్షలు ఉండేలా కార్యక్రమం రూపకల్పన చేశాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలి. 2047 నాటికి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశదిశ నిర్దేశిస్తాం. ఆ తర్వాత పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మన విధానం. రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాదు మనం అనుకున్న విధానాలు అమలు చేసి వ్యవస్థనుగాడిలో పెట్టే బాధ్యత నాది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనందరిదీ.
*అవినీతిపై రాజీలేని పోరాటం*
చరిత్ర ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరనేది అపోహ మాత్రమే. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. నాలుగు దశాబ్ధాల ప్రయాణంలో అవినీతిపై రాజకీయ లేని పోరాటం చేసిన పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటం చేసింది టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరెప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, వ్యాన్ పిక్, హిందూ, లేపాక్షి భూములపై పోరాడాం. ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబుళాపురం అక్రమాలు నిజమని పదేళ్ల తర్వాత కోర్టులు గుర్తించి శిక్షలు వేశాయి. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్లముందు కనపడుతోంది.
*విధ్వంస పాలకులను ప్రజలు తరిమికొట్టారు*
గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తయితే వైసీపీ చేసిన అవినీతి ఒక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాములు లెక్కబెడుతున్నాం. విచారణకు ఆదేశాలిచ్చాం. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకులను ప్రజలు తరిమేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకిచ్చారు. ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నేతలను, అధికారులను ఉపేక్షించం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మనం అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఏడాది క్రితం రాష్ట్రమంతటా సంక్షోభం. ప్రజలిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాం. కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేర్చుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో వైసీపీని ను చిత్తుచిత్తుగా ఓడించాక ఏపీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అనే అలజడి పోయింది. చీకటి తొలగి, భవిష్యత్ పై ఆశలు పెరిగాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజల జీవితాలు బాగుచేస్తాం.
*ప్రతి ఒక్కరికీ సంక్షేమం*
రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్లతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. ఏటా రూ.33 వేల కోట్లు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అదిస్తున్నాం. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో కోటి మందికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం.ఉచిత ఇసుక, మత్సకారుల సేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. డీఎస్సీ నోటిఫికేషప్ ఇచ్చాం. స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం అందిస్తాం. సీమను హార్టికల్చర్ హబ్గా తయారుచేయడం, ఏపీలో ఆక్వా కల్చర్ను ప్రోత్సాహించడం చేస్తున్నాం. మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ ఇచ్చాం. సీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకుంటున్నాం. పొగాకు రైతులను ఆదుకున్నాం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలతో నమ్మకం కల్పించి పెట్టుబడులు తెస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులు పెట్టి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. దీనివల్ల రూ.4 లక్షల 96 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 4 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. రూ.10 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. రూ.లక్షా 20 వేల కోట్ల బిల్లుల పెండింగ్ ఉన్నాయి. టీడీపీ మీద కక్ష గట్టి నీరు చెట్టు, నరేగా వంటి పనులకు బిల్లులు ఇవ్వలేదు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ ,మన మిత్ర తెచ్చాం. ఇదో గేమ్ ఛేంజర్.
*పెద్ద నోట్లు రద్దు చేయాలి*
నేను డిజిటల్ కరెన్సీ పెట్టమని ప్రధానికి రిపోర్ట్ ఇచ్చాను. దీని వల్ల అక్రమార్కులను తేలిగ్గా పట్టుకోవచ్చని చెప్పాను. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తేనే దేశంలో అవినీతి పోతుంది.పార్టీకి డొనేషన్ ఇవ్వాలంటే నేరుగా ఫోన్ ద్వారా అకౌంట్ లోకి డబ్బు చెల్లించవచ్చు.
*సీమ ముఖచిత్రం మార్చింది టీడీపీనే*
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమ స్థితిగతులు మార్చాలని ఎన్టీఆరే మొదట సంకల్పం చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం అంతం చేశాము. తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రినీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి పూర్తి చేసింది టీడీపీనే. సీమ ముఖచిత్రం మార్చిన పార్టీ టీడీపీనే. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చింది టీడీపీనే. గత ఐదేళ్లలో ఒక్కపైసా కూడా ఇరిగేషన్కు ఖర్చు పెట్టలేదు. 2014 - 19లో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రినీవా వెడల్పు చేస్తున్నాం. ఈ ఏడాదే పూర్తి చేసి చివరి భూములకు నీరిస్తాం. పోలవరం-బనకచర్లకు శ్రీకారం చుట్టబోతున్నాం. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లుల పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభిస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి , అనంతపురం కేంద్రాలుగా ప్రతి కుటుంబంలో ఎంట్రప్రెన్యూర్ను తయారుచేస్తాం. మండల పార్టీ అధ్యక్షలు, పార్లమెంటరీ నేతలు, క్లస్టర్ ఇన్ చార్జులు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్థ నాయకత్వాన్ని తయారుచేసుకోవాలి. శక్తి పెంచుకోవాలి. మనది పొలిటికల్ గవర్నెన్స్. ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి వారి ద్వారా పాలన జరిగినప్పుడు నిజమైన పొలిటికల్ గవర్నెస్ సాధ్యం. ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. మహానాడు ద్వారా ఒకటే చెబుతున్నాను. ఏపీని, తెలుగుజాతిని నెంబర్ వన్ చేసే వరకూ నిరంతరం పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..పహల్గాం మృతులు, వీర సైనికులకు నివాళి :*
మరోవైపు మహానాడుకు వచ్చిన టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫోటోగ్యాలరీని తిలకించారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. అలాగే సభ ప్రారంభమైన తర్వాతపహల్గాం మృతులకు, ఆపరేషన్ సిందూర్లో పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు తెలుగుదేశం పార్టీలో మరణించిన వారికి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Comment List